మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం
హనుమకొండ,(విజయక్రాంతి): రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో హనుమకొండ కాంగ్రెస్ భవన్ ముందు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ బిజెపి పాలిత ప్రాంతాలలో ఎమ్మెల్యేలు మహిళలకు గౌరవం ఇవ్వడం లేదని, మహిళలపై దాడులు బిజెపి పాలిత ప్రాంతాల్లో ఎక్కువ అవుతున్నాయి అన్నారు. స్వయంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపణలతో ఫోక్సో కేసు నమోదు అయిందని, దీనిపై బీజేపీ పెద్దలు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
హనుమకొండ మహిళ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్ మాట్లాడుతూ మైనర్ బాలికపై జరిగిన అత్యాచారానికి నిరసనగా కేంద్రమంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని, వెంటనే మంత్రివర్గం నుంచి బండి సంజయ్ ని తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం భేటీ బచావో, బేటి పడావో నినాదంతో ముందుకెళ్తుందని, కాని రాష్ట్ర బిజెపిలో మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి మాట్లాడుతూ మహిళలకు రక్షణ కరువైందని, మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన విషయమై తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలన్నారు.






