27 February, 2026 | 12:13 PM

మహిళా సాధికారతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

27-02-2026 12:00 AM

రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి  సీతక్క.

ములుగు, ఫిబ్రవరి26 (విజయక్రాంతి): మహిళ సాధికారతకు ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మహిళలకు అన్ని రంగాలలో అభివృద్ధి లోకి తీసుకురావడానికి ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని, కోటి మంది మహిళలకు కోటి చీరలను పంపిణీ చేస్తున్నామని ఉపయోగ వృద్ధులకు భరోసా కల్పించడం కోసం 60సంవత్సరాలు నిండిన వయో వృద్ధులకు ప్రత్యేక మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.

గురువారం గోవిందరావుపేట మండలం పసర గ్రామంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క పంచాయతీరాజ్ శాఖ ద్వారా 10లక్షల రూపాయల నిధులతో  ఇందిరా మహిళా శక్తిలో భాగంగా  గ్రామ సంఘాల భవనాలకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాల ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే లక్ష్యంతో మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నామని ఈ పథకం ద్వారా అనేకమంది మహిళలు వివిధ వ్యాపార రంగాలలో రాణిస్తున్నారని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి.

ఇందిరమ్మ ఇండ్లను పూర్తిచేసి   లబ్ధిదారులకు అందించే విధంగా సిద్ధం చేయాలని, జిల్లా లో వివిధ శాఖల లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. గురువారం ములుగు జిల్లా ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ వన దేవతలను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్., ఎస్ పి సుధీర్ రామ్ నాథ్ కేకన్ లతో కలిసి దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాలో వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించాలని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేడారంలో మరిన్ని శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని, భక్తులకు ప్రశాంతమైన దర్శనం కల్పించే విధంగా గద్దెల చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, ఆదివాసి పూజారులతో సమావేశాలు నిర్వహించి వారి సూచన సలహాలు మేరకు పటిష్టమైన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని,మేడారం రహదారుల డివైడర్ మధ్య భాగంలో ప్లాంటేషన్ చేయాలని అన్నారు.

ఘనంగా గుంజేడు జాతర 

మహబూబాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): గుంజేడు జాతరను అత్యంత ఘనంగా నిర్వహించడానికి జాతర ఉత్సవ కమిటీ కృషి చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం దేవాదాయ శాఖ, అటవీ శాఖ ఆధ్వర్యంలో సౌకర్యాలు కల్పించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు లో నూతన కమిటీ అధ్యక్షుడు బుర్కా నరేందర్ ఆధ్వర్యంలో ట్రస్టు బోర్డు సభ్యుల పదవి బాధ్యతల స్వీకారానికి మంత్రి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుంజేడు ముసలమ్మ జాతర తమకు ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలను జాతర నిర్వహణ కోసం కేటాయించడం పట్ల మంత్రి హోండా సురేఖకు సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గుంజేడు ప్రాంతంలో పర్యాటకుల కోసం హరితనిధి ద్వారా ఏర్పాటుచేసిన తాత్కాలిక వసతి ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ములుగు మార్కెట్ చైర్మన్ రేగ కళ్యాణి, కొత్తగూడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్జ సారయ్య, భద్రాద్రి సర్కిల్ సిసిఎఫ్ డాక్టర్ భీమా నాయక్, మహబూబాబాద్ జిల్లా అటవీ అధికారి విశాల్ బత్తుల తదితరులు పాల్గొన్నారు.