05-02-2026 03:45:04 PM
– డీఈఓ ఏ. రమేష్ కుమార్.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం–2005 ద్వారా పౌరులు కోరిన సమాచారాన్ని నిర్దేశిత గడువులోగా అందించడం ప్రతి అధికారి బాధ్యత అని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని డీఈఓ కార్యాలయంలో మండల విద్యాధికారులు, కార్యాలయ సిబ్బందికి సమాచార హక్కు చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా అధికార యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని తెలిపారు.
పౌరులు కోరిన సమాచారాన్ని నిర్ణీత కాలవ్యవధిలోగా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల స్థాయిలో మండల విద్యాధికారులు, పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులు సమాచారాన్ని సకాలంలో అందించడం తమ బాధ్యతగా భావించాలని అన్నారు. అదేవిధంగా స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారాన్ని ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచాలని సూచించారు. అంతకుముందు మండల విద్యాధికారులు సమాచార హక్కు చట్టానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు కిరణ్ కుమార్, వెంకటయ్య, నూరుద్దీన్, షర్ఫుద్దీన్, శోభారాణి, మధుసూదన్ రెడ్డి, కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్, సుజాతతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.