21-02-2026 02:24:11 AM
రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): రాజకీయాలను పక్కనపెట్టి ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో కలిసి పనుల పురోగతిని పర్యవేక్షించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభు త్వం నిధులతో వివిధ శాఖల సమన్వయంతో పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరిగిన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలవకుండా రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణలు చేపట్టడం జరుగుతోందన్నారు. రెండు నుంచి మూడు నెలల్లోపు ఈ పనులు పూర్తికానున్నాయని, చిన్నచిన్న ఇబ్బందులు ఉంటే ప్రజలు సహకరించాలని కోరారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ ప్రణయ్, కాంగ్రెస్ నేత గోవర్దన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.