నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
నూతన మండల అధ్యక్షులను శాలువాతో సన్మానం చేసిన ఎమ్మెల్యే
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తినియోజకవర్గంలోని తొమ్మిది మండలాల నూతన అధ్యక్షులను శుక్రవారం హైదరాబాద్ లో ఎమ్మెల్యే సామేలు నివాసంలో శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. అందరిని కలుపుకొని పోతూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందేలా ప్రతి కార్యకర్తలకు అందుబాటులో వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తాను నియోజకవర్గ మొత్తం కలియ తిరిగానని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ప్రజలు తనకు ఎన్నడు లేని విధంగా 52వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారని, ప్రజల రుణం ఏనాడు తీర్చుకోలేనిదన్నారు. నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల నూతన అధ్యక్షులను నియమించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.2వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. రోడ్లు, వంద పడకల ఆస్పత్రి, మహిళా శక్తి భవనాలు, నూతన గ్రామ పంచాయతీలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.






