అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్ఐ
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మండలంలోని ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టి, విద్యా హక్కు చట్టాన్ని (ఆర్టీఈ) పకడ్బందీగా అమలు చేయాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కాగజ్నగర్ మండల విద్యాధికారి వసాల ప్రభాకర్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గోడిసెల కార్తీక్, జిల్లా కార్యదర్శి గేడం టికనంద్ మాట్లాడుతూ, మండలంలోని ప్రైవేటు పాఠశాలలు పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేయకుండా, ఫీజుల ధరల పట్టికలు ప్రదర్శించకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.
పాఠశాలల ఆవరణలోనే షూలు, బెల్టులు, టైలు, నోట్బుక్స్, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు విక్రయించడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు.శ్రీ చైతన్య, అరుణోదయ, శాంతినికేతన్, వీఐపీ, విశ్వశాంతి, ఫాతిమా కాన్వెంట్, సెయింట్ క్లారెట్ పాఠశాలల్లో ఈ నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మండలంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలపై సమగ్ర విచారణ నిర్వహించి, ఫీజుల ధరల పట్టికలు తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల విద్యాధికారి వసాల ప్రభాకర్ను కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.






