వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి
గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి
డీఎల్పీవో ప్రసాద్ రావు
బాన్సువాడ,(విజయక్రాంతి): వర్షాకాలం దృష్ట్యా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు రోగాల బరిన పడకుండా పరిశుద్ధ పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని డిఎల్పివో ప్రసాద్ రావు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం గ్రామపంచాయతీ సర్పంచులు కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎల్పివో ప్రసాద్ రావు మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సర్పంచులు కార్యదర్శులు ఎప్పటికప్పుడు గ్రామంలో పేరుకపోయిన చెత్తాచెదారాన్ని మురికి నీటిని తొలగించాలని ఆయన సూచించారు.
అదేవిధంగా దోమలు వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు దోమల మందు పిచికారి చేయాలని ప్రజలు రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా వచ్చే తాగునీటి సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రజలకు తాగినీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆయన తెలిపారు. అదేవిధంగా మురికి కాలువల ద్వారా వచ్చిన నీటిని గ్రామ శివారు ప్రాంతంలో గుంతలు తవ్వి నీటిని మళ్లించే విధంగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలన్నారు.
అదేవిధంగా జిరాంజి పథకం ద్వారా ప్రతి ఇంటింటికి వర్షం నీరు వృధా పోకుండా ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్న విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. అదేవిధంగా గ్రామంలో ఎవరైనా ఇంటి పెద్దలు మరణిస్తే 2017 నుంచి చనిపోయిన వారి వివరాలను ఎంపీడీవో కార్యాలయంలో అందజేస్తే ప్రభుత్వం ద్వారా రూ.20 వేలు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామంలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా సర్పంచులు కార్యదర్శులు కృషి చేయాలని ఏదైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు.
అనంతరం సర్పంచుల సంఘ అధ్యక్షుడు నాందేవ్ మాట్లాడుతూ గత ఆరు నెలలుగా బిల్లులు మంజూరు కావడంలేదని వెంటనే మంజూరు అయ్యేవిధంగా చూడాలని అధికారులను కోరారు. అదేవిధంగా గ్రామాలలో మిషన్ భగీరథ ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతుందని వెంటనే అరికట్టే విధంగా అధికారులు చూడాలని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు మంజూరయ్యే విధంగా చూడాలని అధికారులను కోరారు.






