27 February, 2026 | 7:43 AM

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి సహకరించండి

27-02-2026 12:53 AM

తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్‌చెరు, ఫిబ్రవరి 26 : పటాన్చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు సిఎస్‌ఆర్ నిధులు కేటాయించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తోషిబా యాజమాన్యాన్ని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారంలో గల తోషిబా పరిశ్రమ యాజమాన్యం ప్రతినిధులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులకు పరిశ్రమ యాజమాన్యం సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ప్రధానంగా ఇటీవల పటాన్చెరు నియోజకవర్గానికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు కావడం జరిగిందని.. శాశ్వత ప్రతిపాదికన అమీన్పూర్ పరిధిలోని సర్వేనెంబర్ 993లో కళాశాల భవనం, హాస్టల్ భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. నిధుల కొరత మూలంగా భవన నిర్మాణ పనులు ముందుకు కొనసాగడం లేదని తెలిపారు.

ఈ నేపథ్యంలో కళాశాల మరియు హాస్టల్ భవన నిర్మాణాల కోసం 45 కోట్ల 70 లక్షల రూపాయలతో ప్రభుత్వ ఇంజనీరింగ్ అధికారులు అంచనాల రూపొందించడం జరిగిందని వారి దృష్టికి తీసుకెళ్లారు. పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ భవనాల నిర్మాణ కోసం పరిశ్రమ సిఎస్‌ఆర్ నిధులు కేటాయించి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పరిశ్రమ యాజమాన్యాకి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పరిశ్రమ సిఎండి హిరోషి ఫురుట, డైరెక్టర్ మానవ వనరుల విభాగం కట్టుతోషి మారుమోతో, హెచ్ ఆర్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.