సమాధానం చెప్పలేకే దాడులు
- ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయంపై, ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై దాడి హేయం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు
హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): సమాధానం చెప్పలేకనే కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు దాడులకు తెగబడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది హేయమైన చర్య అని, దాడి జరిగిన వెంటనే ఎమ్మెల్యే కౌశిక్రెడ్డితో మాట్లాడినట్టు గురువారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
పట్టపగలు గుండాల మాదిరిగా క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించి వాహనాలను, ఆఫీసును ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కళ్లముందే ఇంత అరాచకం సృష్టిస్తు న్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ చో ద్యం చూడటం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్కు బీ-టీంగా మారిన బండి సంజయ్..
బీఆర్ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే పిరికిపంద చర్యలకు ఉసిగొలుపుతున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కుప్పిగంతులు వేయడం తప్ప కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ చేసిందేమీ లేదని ఎద్దేవాచేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి తన అనుచరులతోనే శాంతి భద్రతలను దెబ్బతీసేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యా న్ని అపహాస్యం చేయడమేనన్నారు.
శాంతి భద్రతలున్నట్టా? లేనట్టా?: మాజీమంత్రి హరీశ్రావు
ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు జరుగుతుంటే రా ష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్లా? లేనట్లా? అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై, ఎమ్మె ల్యే పాడి కౌశిక్రెడ్డిపై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అత్యంత దురదృష్టకరమన్నారు. దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ఆపకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సి వస్తుందని హెచ్చరించారు.






