నత్తకు నడక నేర్పేలా!
- జుక్కల్ నియోజకవర్గం లో ఆగిన పనులు
- ఇద్దరు ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేసినా.. పూర్తిగానీ పనులు
- ఐదు మండలాలను అదే పరిస్థితి
జుక్కల్, మే12 (విజయ క్రాంతి): సెంట్రల్ లైటింగ్, రోడ్డు డివైడర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని ఐదు మండల కేంద్రాల్లో 2023లో సెంట్రల్ లైటింగ్ , రోడ్డు డివైడర్ పనులు కు నిధులు మంజూరయ్యాయి. ఐదు మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ పనులు, రోడ్డు డివైడర్ పనులు చేపట్టి పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యేలు సంకల్పించారు. సంకల్పం బాగానే ఉన్న పనులు మాత్రం మూడు అడుగుల ముందుకు రెండు అడుగులు వెనక్కు అనే సామెత లాగా నత్త నడకన పనులు సాగుతున్నాయి.
2023లో అప్పటి ఎమ్మెల్యే హనుమంతు షిండే రోడ్డు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు నిధులు మంజూరు చేయించారు. పనులు మొదలుపెట్టి వదిలేశారు. దీంతోపాటు అప్పుడే ఎన్నికల రావడం నిధులు విడుదల కాకపోవడం తో కాంట్రాక్టర్ లు పనులు చేపట్టకుండా చేతులెత్తేశారు. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఎన్నిక కావడంతో గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల పనులు పూర్తి చేయకపోవడంతో ఆ పనులకు రద్దుచేసి 2025 లో పనులకు రిటెండర్ చేపట్టారు.
అంతవరకు బాగానే ఉన్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. జుక్కల్ మండల కేంద్రంలో మాత్రమే పనులు వేగంగా సాగుతున్న నాణ్యత లోఫo కనిపిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2023లో జుక్కల్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సెంట్రల్ లైటింగ్ పనులకు 32 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి. బిచ్కుంద మండలానికి 12 కోట్లు, పిట్లం మండలానికి 12 కోట్లు నిధులు మంజూరు కావడంతోపాటు మద్నూర్, పెద్ద కొడంగల్, నిజాంసాగర్ మండలాల్లో పనులు పూర్తి కాకపోవడంతో ప్రస్తుత ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు పనులను పర్యవేక్షించి పాత కాంట్రాక్టర్లను వద్దని రిటెండర్ వేయించి కొత్త కాంట్రాక్టర్లకు 2025 నవంబర్లో పనులు అప్పగించారు.
అయినప్పటికీ ఇప్పటివరకు ఏ మండలంలో కూడా సెంట్రల్ లైటింగ్, రోడ్డు డివైడర్ పనులు సక్రమంగా కొనసాగడం లేదని ఆయా మండలాల ప్రజలు పేర్కొంటున్నారు. అన్ని మండలాల్లో సగం సగం పనులు చేసి కాంట్రాక్టర్లు వదిలేస్తున్నారని ప్రజలు నిత్యం అవస్థలు పడాల్సి వస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపనలు చేశారు. పనులు మాత్రం పూర్తి కాలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే సైతం సెంట్రల్ లైటింగ్ పనులకు మళ్లీ శంకుస్థాపనలు చేశారు. పనులు మాత్రం ముందుకు కొనసాగాకపోవడంతో నిత్యం ప్రజలు మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ లో పనులు నిలిచిపోవడంతో నిత్యం అవస్థలు పడుతున్నారు.
గుంతల మయంగా రోడ్డు
బిచ్కుందలో ఉన్న రోడ్డును తవ్వేసి కంకర వేసి గుంతల మయంగా మార్చారని స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడి స్కిడ్ ఐ పడుతున్నారు. బిచ్కుంద పట్టణ కేంద్రం కావడంతో పాటు సెంట్రల్ లైటింగ్ పనులు రోడ్డు డివైడర్ పనులు పూర్తయితే ఎంతో అభివృద్ధి జరిగినట్లుగా కనిపిస్తుందని పట్టణ ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం నిత్యం దుమ్ము ధూళితో పాటు ప్రజల ఆరోగ్యం పాడవుతుందని స్థానికులు వాపోతున్నారు.
ఎన్నిసార్లు విన్నవించిన ముందుకు సాగని పనులు
ఎన్నిసార్లు స్థానిక ఎమ్మెల్యే కు, అధికారులకు తెలిపిన నిర్లక్ష్యం వహిస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. పిట్లం మండల కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని, మండల కేంద్రంలో పనులు అసలికే ప్రారంభించలేదని అంటున్నారు. నిజాం సాగర్ మండల కేంద్రంలో చౌరస్తా రోడ్డు నుండి కొద్దిపాటి పనులు చేసి వదిలేసారని, మద్నూర్ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనుల కోసం శంకుస్థాపన చేసినప్పటికీ కనీసం తవ్వకాలు జరిపిన ఆనవాలు కూడా కనిపించడం లేదన్నారు. పనులు ముందుకు సాగకపోవడం పట్ల స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మండల కేంద్రాల్లో పనులు జరుగుతున్న మరికొన్ని మండల కేంద్రాల్లో కంకర వేసి వదిలిపెట్టడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాం
ఇటీవల పనులపై ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అధికారులతో, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పనులు పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికైనా పనులు నత్తనడకన కాకుండా చురుకుగా పనులు కొనసాగుతాయా లేదా వేచి చూడాల్సిందే.
- ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు






