టెస్ట్ క్రికెట్లో పింక్ బాల్?
కీలక మార్పుల దిశగా ఐసీసీ
దుబాయి, మే 23 : టెస్ట్ క్రికెట్లో కీలక మార్పులు జరగబోతున్నాయి. ఈ మేరకు ఐసీసీ సమావేశంలో చర్చించారు. వర్చువల్గా జరిగిన సమావేశానికి ఐసీసీ చైర్మన్ జై షా సహా ఐసీసీ క్రికెట్ కమిటీ హెడ్ సౌరవ్ గంగూలీ సహా తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టెస్టు క్రికెట్లో వినియోగిస్తున్న ఎర్రబంతికి బదులు ఇకపై గులాబీ బంతిని వినియోగంలోకి తీసుకురావాలనే యోచనలో ఐసీసీ ఉంది.
టెస్టు ఫార్మాట్లో వేర్వేరు రంగుల బంతులను ఉపయోగించడాన్ని గత కొంతకాలంగా ఐసీసీ పరిశీలిస్తోంది. తద్వారా సాంప్రదాయ టెస్ట్ మ్యాచ్ సమయంలో ఎరుపు బంతికి బదులుగా గులాబీ బంతికి మారే ఆలోచన కూడా ఉంది. ప్రస్తు త పరిస్థితులలో, వాతావరణ అంతరాయాలు ఏర్పడినప్పుడు లైట్ల వెలుగులో ఆటను కొనసాగించడానికి ఇరు జట్లు అంగీకరిస్తే, ఎరుపు బంతికి బదులుగా గులాబీ బంతిని ఉపయోగిస్తారు. దీనికి సంబంధించి పూర్తి నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు.
అలాగే డ్రింక్స్ విరామ సమయంలో హెడ్ కోచ్ను మైదానంలోకి అనుమతించడంపై సమావేశంలో చర్చకు వచ్చింది. అయితే దీనిని వన్డే క్రికెట్లో తీసుకురావాలని ఐసీసీ యోచిస్తోంది. ఇప్పటివరకు సబ్స్టిట్యూట్ ఆటగాళ్లకు మాత్రమే డ్రింక్స్ విరామంలో మైదానంలోకి అనుమతిస్తున్నారు. ఇక వన్డే క్రికెట్లో ఒక ఇన్నింగ్స్లో రెండు డ్రింక్స్ బ్రేక్స్ ఉండేలా మార్పులు చేయనున్నారు. ఒక ఇన్నింగ్స్లో ప్రతీ డ్రింక్స్ బ్రేక్కు గంటా 10 నిమిషాల వ్యవధి ఉండనుంది.ఇదిలా ఉంటే టీ20 క్రికెట్లో ఇన్నింగ్స్ విరామ సమయా న్ని తగ్గించాలని ఐసీసీ సమావేశంలో ప్రతిపాదించింది. ఇప్పటివరకు ఉన్న 20 నిమి షాల సమయాన్ని 15 నిమిషాలకు కుదించాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయా లన్నింటిపై మే 30న అహ్మదాబాద్లో జరిగే సమావేశంలో స్పష్టత రానుంది.






