04-02-2026 12:15:18 AM
* అన్ని వార్డులను అభివృద్ధి చేస్తా
* కాంగ్రెస్ నాయకులకు జగ్గారెడ్డి దిశానిర్దేశం
సంగారెడ్డి, ఫిబ్రవరి 3(విజయక్రాంతి): సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 38 వార్డులను గెలిపించుకొని రండి..ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు తెచ్చి అన్ని వార్డుల అభివృద్ధిని నేను చూసుకుంటానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. మంగళవారం తనను కలిసిన అభ్యర్థులు, పార్టీ నాయకులకు జగ్గారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేయిస్తానని హామీనిచ్చారు. రామ్ నగర్ అభ్యర్థిగా శ్రీకాంత్ గౌడ్ ఉన్నాడని, ఐదేళ్ళ తర్వాత సిద్దు అభ్యర్థిగా ఉంటాడని ప్రకటించారు.
మీ వార్డుల్లో ఉన్న అభ్యర్థులను గెలిపించడంతో పాటు మిగతా వార్డుల్లో పరిచయం ఉన్న వాళ్లను కూడా గెలిపించేలా ప్రచారం చేయాలన్నారు. ఎన్నికల తర్వాత కారణాలు చెప్పొద్దని అభ్యర్థులను గెలిపించుకొని రావడమే మీ బాధ్యతని చెప్పారు. అందరు కలిసికట్టుగా పని చేసి సంగారెడ్డి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలన్నారు. 5వ వార్డుకు చెందిన అమెర్ బేగ్ కు కో ఆప్షన్ సభ్యుడిగా అవకాశం ఇస్తానని, ఆ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకొని రావాలని సూచించారు.