14 March, 2026 | 8:54 AM

రిజర్వ్ ఫారెస్ట్‌గా గుర్రంగూడ

14-03-2026 02:17 AM
  1. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

మరో భారీ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటుకు అటవీ శాఖ కసరత్తు

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా న్యాయ వివాదాల్లో చిక్కుకున్న అమంగల్ డివిజన్ పరిధిలోని గు్రంగూడ అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వం ఎట్టకేలకు రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించింది. 424 ఎకరాలు 31 గుంటల విస్తీర్ణం గల ఈ భూభాగాన్ని ఫారెస్ట్ చట్టం-1967లోని సెక్షన్ 15 ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్‌గా గుర్తిస్తూ పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ  ఉత్తర్వులు జారీ చే సింది.

దీంతో ఈ ప్రాంతానికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ పూర్తు, అటవీ భూములకు అధికారికంగా రిజర్వ్ ఫారెస్ట్ హోదా లభించిందని అటవీ దళాల ముఖ్య సంరక్షిణాధికారి డాక్టర్ సువర్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నిర్ణయంతో ఆ అటవీ భూములకు మరింత బలమైన చట్టపరమైన రక్షణ లభించనుందన్నారు. ఈ విస్తీర్ణంలో భాగమైన సాహెబ్‌నగర్ కలాన్‌లోని సర్వే 201/1లోని 102 ఎకరాలు చాలా కాలంగా న్యాయ వివాదంలో ఉన్నాయని, సాహెచ్‌నగర్ కలాన్ కేసుగా ప్రసిద్ధి చెందిన ఈ వ్యవహారం దీర్ఘకాలంపాటు వివిధ న్యాయస్థానాల్లో విచారణ కు రాగా అటవీ అధికారుల కృషి, ప్రభుత్వ మద్దతువలన చివరకు అటవీ శాఖ వాదనను సుప్రీంకోర్టు సమర్థి స్తూ తీర్పు ఇచ్చిందని పీసీసీఎఫ్ సువర్ణ తెలిపారు. ఈ తీర్పుతో ఆ భూములపై ప్రభుత్వ హక్కులు మరింత బలపడ్డాయన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని భారీ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని, హైదరాబాద్ నగరంలో వేగంగా పెరుగుతున్న నగరీకరణ నేపథ్యంలో పచ్చని ప్రదేశాల అవసరం పెరుగుతున్న పరిస్థితిలో ఈ పార్క్ నగర ప్రజలకు ముఖ్య మైన గ్రీన్ స్పేస్‌గా మారనుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అటవీ భూముల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఆక్రమణలను అరికట్టడంలో కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు.

అదే సమయంలో హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులు, గ్రీన్ లంగ్ స్పేస్‌ను విస్తరించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. గుర్రం గూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించడం కూడా ఆ దిశలో తీసుకున్న కీలక నిర్ణయంగా పేర్కొన్నారు.