30 April, 2026 | 4:31 AM

ప్రకృతి వైపరీత్యం కాదు.. పాలకుల వైఫల్యమే..!

30-04-2026 12:50 AM

రైతులు రోడ్డెక్కితే పాలకులు పారిపోతారా..?

ప్రజా పాలనలో రైతులకు తీరని అన్యాయం

తడిసిన ప్రతి గింజను కొనాలి లేదంటే ఉద్యమం తీవ్రతరం

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

నాగర్కర్నూల్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): అకాల వర్షాలతో తడిసిన మొక్కజొన్నను ప్రకృతి వైపరీతంగా భావిస్తూ అధికారులు పాలకులు తేలికగా తీసుకుంటున్నారని ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ద్వాజమెత్తారు. బుధవారం బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నాగం శశిధర్ రెడ్డితో కలిసి వ్యవసాయ మార్కెట్ సందర్శించారు.

మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మార్కెట్లోని ధాన్యం అంత తడిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారిని ఓదారుస్తూ వారికి మద్దతుగా ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. అనంతరం ట్రాక్టర్ లోని ధాన్యాన్ని నేరుగా కలెక్టరేట్ కు తీసుకువెళ్లి కలెక్టరేట్ ముందు బైటాయించి రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని అందించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులంతా రెక్కలు మొక్కలు చేసుకొని పంటలు పండిస్తే వాటిని కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పంట పూర్తిగా వరద నీటిలో కొట్టుకుపోయిందని దీంతో ఆ రైతును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందన్నారు. తడిచిన ప్రతి గింజను మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు న్యాయం కోసం రోడ్డెక్కితే పాలకులు ఎక్కడ దాక్కుంటారని ప్రశ్నించారు. రైతులు ఆందోళనకు దిగితే పోలీసులను పెట్టి బెదిరించడం సరికాదని అన్నారు.

సీఎం స్పందించి రైతుల నష్టానికి బాధ్యత ఎవరిదో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కనిపించడం లేదని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగులు, వాహనాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నెలరోజులుగా పంట అమ్మకానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, ఎండలోనూ వర్షంలోనూ క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని చెప్పారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. వెంటనే కొనుగోలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు.