అన్లోడింగ్ ప్రక్రియ కూడా వేగంగా జరగాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా జరగాలని, అదేవిధంగా మిల్లుల వద్ద ధాన్యం బస్తాల అన్లోడింగ్ ప్రక్రియ కూడా వేగంగా జరగాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఏఎస్పి రాజేష్ మీనాతో కలిసి పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డిపల్లి పాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, వీరాయిపల్లి సమీపంలోని ఎఫ్ పి ఓ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో దాన్యం నమోదు రిజిస్టర్లను కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం ఇన్చార్జ్ లకు పలు సూచనలు చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా జరగాలని సూచించారు. తేమశాతం నిర్ధారించుకుని వేగంగా కాంటాక్ట్ చేసి కేటాయించిన మిల్లుకు తరలించే విధంగా చూడాలన్నారు. రెవెన్యూ శాఖ తరపున కేటాయించిన ప్రత్యేక అధికారి కొనుగోలు కేంద్రం వద్ద ఈ పది రోజులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ ఆరా తీయగా, ఈ క్రమంలో రైతులు కలెక్టర్ తో మాట్లాడుతూ లారీల ట్రాన్స్పోర్ట్ సమస్య ఉందని, అందువల్లనే ధాన్యం మిల్లులకు తరలించడం ఆలస్యం అవుతుందని తెలియజేశారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ లారీలను అదనంగా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైస్ మిల్ సందర్శన
ఖిలా గణపురం మండల పరిధిలోని సోలిపురం గ్రామ శివారులో ఉన్న సింధు ఆగ్రో రైస్ మిల్లు ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. మిల్లు ఆవరణలో వేచి ఉన్న ధాన్యం లారీలను వేగంగా అన్లోడ్ చేయించాలని సూచించారు. అదేవిధంగా గోదాంలో ధాన్యం బస్తాల అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. మిల్లు వద్ద మిల్లర్లు ధాన్యంలో తాలు చెక్ చేసే విధానాన్ని స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
-






