తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు
తూప్రాన్,(విజయక్రాంతి): బక్రీద్ పండుగ నేపథ్యంలో తూప్రాన్ టోల్ గేట్ చెక్ పోస్టును తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్ రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ అప్రమత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తూప్రాన్ టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్ పోస్టును ఆయన స్వయంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. పండుగ నేపథ్యంలో జిల్లా సరిహద్దుల గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ముఖ్యంగా పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే అనుమానాస్పద వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే చెక్ పోస్టుల వద్ద ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.
ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పశువుల రవాణా తనిఖీల్లో సమన్వయం కోసం వెటర్నరీ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాత్రి సమయంలో విధులు నిర్వహించే సిబ్బంది వాహనాల తనిఖీలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ట్రాఫిక్ బ్యాటన్స్ మరియు రిఫ్లెక్టివ్ జాకెట్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి ఆదేశించారు.






