గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని
నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్థా...
అన్ని గ్రామాలకు బిటి రోడ్ల అనుసంధానమే మా ప్రధాన అజెండా..
రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన
కొత్తగూడెం,(విజయక్రాంతి): నియోజకవర్గంలోని ప్రతి పల్లెను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని, గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం, సర్వారం గ్రామపంచాయతీ పరిధిలోని కంకరమిల్లు నుంచి గోపతండా వరకు రూ.1 కోటి వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డు పనులకు బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారానే ఆర్థికాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. తన నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామానికి బిటి, సిసి రోడ్ల సౌకర్యం కల్పించాలన్నదే తన లక్ష్యమని, అందుకోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, శక్తివంచన లేకుండా పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఈ పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తన ప్రయాణం సాగుతుందని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు వెచ్చించి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.






