మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి
మల్లెపల్లిలో విలేకరుల సమావేశంలో మంథని బిజెపి నాయకుల డిమాండ్
మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని మల్లెపల్లి గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని అడ్డాగా చేసుకుని, అక్రమ ట్రక్ షీట్ల ద్వారా 8 లారీల ధాన్యాన్ని సుల్తానాబాద్లోని రైస్ మిల్లులకు తరలించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారని బిజెపి పార్టీ ఆరోపించింది. ఈ ఘటనపై తక్షణమే (సిబిసిఐడి) చే విచారణ జరిపించాలని పార్టీ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. బిజెపి నాయకులు బుధవారం మల్లెపల్లి కేంద్రాన్ని సందర్శించి, అక్కడ రోజుల తరబడి నిరీక్షిస్తున్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రైతులకు ఎలాంటి 'కటింగ్' లేకుండా తక్షణమే వడ్ల కాంటాలు పూర్తి చేయాలని, త్వరిత రవాణా కాంటా అయిన వడ్లను వెంటనే లారీల ద్వారా మిల్లులకు తరలించి రైతులను కష్టాల నుంచి గట్టెక్కించాలని, అక్రమాల వెనుక సూత్రధారులు ఎవరు? మహారాష్ట్రలోని సిరివంచ నుంచి సుల్తానాబాద్ రైస్ మిల్లులకు అక్రమ ట్రక్ షీట్ల ద్వారా ధాన్యం రవాణా అయినట్లు టాస్క్ ఫోర్స్ అధికారుల నిర్ధారించిన నేపథ్యంలో బిజెపి నాయకులు తీవ్రంగా స్పందించారు.
ఈ అక్రమ రవాణా వెనుక ఎంతటి పెద్ద నాయకులు ఉన్నా వదిలిపెట్టకూడదని, ప్యాక్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దందాపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యుల ఆస్తులపై నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. అక్రమ రవాణాకు పాల్పడిన ప్రధాన పాత్రధారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. బాధ్యులపై చర్యలు ప్యాక్స్ సీఈఓలు, సూపర్వైజర్లు, ప్యాక్స్ చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
గత రికార్డుల తనిఖీ
గత 6 సంవత్సరాలుగా ప్యాక్స్ నిర్వహణలో ఉన్న వారి ఆస్తులపై మరియు వారి పనితీరుపై చట్టపరమైన విచారణ చేపట్టాలని మంథని ఆర్డీఓ సురేష్ ను కలిసి బిజెపి నాయకులు మెమోరాండం సమర్పించారు. మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాలపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టాలని వారు కోరారు.






