మత్స్యకార్మికులకు ప్రభుత్వం పెద్దపీట
అదనపు కలెక్టర్ నగేష్
మెదక్, మే 8 (విజయ క్రాంతి) : మత్స్య కార్మికులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి మత్స్యకారులకు ఆవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా మత్స్యశాఖ ఇన్చార్జి గడప దేవేందర్ లు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్ర గీతం జయ జయహేతో.. కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. మత్స్య సంపదను పరిరక్షించడం ద్వారా మత్స్యకారుల ఆర్థిక స్థితి మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం మత్స్య కార్మికుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని ప్రతి మత్స్యకారుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మత్స్య సహకార సంఘం పర్సన్ ఇంచార్జి గడప దేవేందర్ మాట్లాడుతూ..ప్రతి మత్స్యకారుడు ప్రకృతి సంపదను కాపాడే బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో 200 మత్స్య సొసైటీలో 15,888 మత్స్య కార్మిక సభ్యులు ఉన్నారని, అందులో 25 మంది మహిళా మత్స్య కార్మికులు ఉన్నారన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లేశం మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, రుణ సౌకర్యాలు, బీమా పథకాలు, మత్స్యకార భరోసా పథకాల గురించి వివరించి ప్రతి లబ్ధిదారుడు నమోదు చేసుకోవాలని కోరారు.
మత్స్యకారులకు చేపల పెంపకంలో పాటించాల్సిన శాస్త్రీయ పద్ధతులు, చెరువుల నిర్వహణ, చేపల విత్తనాల ఎంపిక, ఆహార నిర్వహణ, నీటి నాణ్యత పరిరక్షణ, వ్యాధుల నివారణ వంటి అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. అలాగే ఆధునిక సాంకేతికతను వినియోగించి చేపల ఉత్పత్తిని పెంచుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






