ఆదర్శ బాలికల వసతిగృహాన్ని సందర్శించిన పాలకవర్గం
మల్లాపూర్, జూలై 31: మల్లాపూర్ మండల కేంద్రం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆదర్శ బాలికల వసతి గృహాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి, భారీ వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయా అని ఆరా తీశారు. తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని విద్యార్థినులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆదర్శ బాలికల వసతి గృహం కేర్టేకర్ & వార్డెన్ డి. శ్రీలత మాట్లాడుతూ, ఆదర్శ పాఠశాలకు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతినడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, సమస్యను త్వరితగతిన పరిష్కరించి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం భారీ వర్షాలతో నీట మునిగిన ఆదర్శ పాఠశాల రహదారిని దాటలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను గ్రామపంచాయతీ పాల కవర్గం స్వయంగా సురక్షితంగా రోడ్డు దాటించింది.
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ స్వయంగా పర్యవేక్షించారు. కాగా, గురువారం ఇదే నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఆదర్శ పాఠశాల వాచ్మెన్ సత్యనారాయణను కూడా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం సురక్షితంగా కాపాడిన విషయం తెలిసిందే.ఈ కార్యక్రమాల్లో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ముష్కరి రమే ష్, భుఖ్య శేఖర్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి, వాల్గొండ తండా సర్పంచ్ ధరమ్ సోత్ సురేష్ తదితరులు పాల్గొన్నా రు. అతి భారీ వర్షాల సమయంలో ప్రజలకు, విద్యార్థులకు అండగా నిలిచిన గ్రామ పంచాయతీ పాలకవర్గం సేవలను గ్రామస్తులు అభినందించారు.






