17 April, 2026 | 8:13 PM

Breaking News

గోల్డెన్ అవర్‌ ప్రాణానికి రక్షణ కవచం

17-04-2026 06:50 PM

- జైపూర్ ఎస్‌ఐ రాజశేఖర్

జైపూర్,(విజయక్రాంతి): ప్రాణాపాయ పరిస్థితుల్లో మొదటి గంట ‘గోల్డెన్ అవర్’ అని, ఇదే ప్రాణానికి రక్షణ కవచం అని ఎస్‌ఐ రాజశేఖర్ అన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రమాదం జరిగిన వెంటనే సరైన సమయంలో స్పందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చన్నారు.

ప్రమాదం జరిగిన తొలి 60 నిమిషాలు అత్యంత కీలకమని, ఈ సమయంలో గాయపడిన వ్యక్తికి తక్షణ వైద్య సహాయం అందితే ప్రాణాపాయం తగ్గించవచ్చన్నారు. రక్తస్రావం ఆపడం, శ్వాస సక్రమంగా ఉండేలా చూడడం వంటి ప్రాథమిక చర్యల ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందన్నారు. ప్రమాద బాధితులకు తక్షణ సహాయం చేసి ప్రాణాలను కాపాడిన వ్యక్తులను ప్రభుత్వం “రాహ్-వీర్”లుగా గుర్తించి రూ. 25 వేల నగదు బహుమతితో సత్కరిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా ప్రజల్లో సేవాభావాన్ని పెంపొందించి, అత్యవసర పరిస్థితుల్లో ముందుకు రావడానికి ప్రోత్సహిస్తుందన్నారు.

గుండె ఆగినప్పుడు సీపీఆర్ తప్పనిసరి

గుండె ఆగినప్పుడు లేదా శ్వాస ఆగినప్పుడు సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని ఎస్సై రాజశేఖర్ తెలిపారు. బాధితుని స్పందన, శ్వాసను ముందుగా పరిశీలించి ఛాతిపై సరైన స్థానంలో, సరైన ఒత్తిడితో కంప్రెషన్‌లు ఇవ్వాలన్నారు. నిమిషానికి 100–120 కంప్రెషన్‌ల వేగంతో చేయాలని, శిక్షణ పొందిన వారు మాత్రమే మౌత్-టు-మౌత్ పద్ధతిని అనుసరించి అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రమాద స్థలంలో గాయపడిన వ్యక్తిని అవసరం లేకుండా కదలించకూడదని, రక్తస్రావం ఉంటే గట్టిగా కట్టు కట్టి నియంత్రించి అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలన్నారు. అలాగే ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు.