గిరివాణి, ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ములుగు (మహబూబాబాద్) ఏప్రిల్ 20 (విజయక్రాంతి): గిరివాణి, ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని, పాఠశాలలు, వసతి గృహాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ములుగు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం ఐటీడీఏ ఏటూరునాగారం సమావేశ మందిరంలో ప్రజావాణి,గిరివాణి గిరిజన దర్బార్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవిస్తూ అర్జీలను స్వయంగా కలెక్టర్కు అందించారు. జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత శాఖ అధికారులకు పంపిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. గిరివాణి గిరిజన దర్బార్ కార్యక్రమానికి 96, ప్రజావాణి కార్యక్రమానికి 26, మొత్తం 122 ఫిర్యాదులు అందాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు పాఠశాలలు, వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం వాటిని పర్యవేక్షించి, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికను రూపొందించాలని సూచించారు. వంటశాల, స్టోర్ రూమ్, క్యాంపస్ పరిసరాలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి లాంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలను వెంటనే అందించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సి.హెచ్. మహేందర్ జీ, ఏపీవో వసంతరావు, ఆర్డీఓ వెంకటేష్, డీడీ జనార్దన్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ, ఐటీడీఏ ఏఓ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






