వేసవి కాలం దృష్టా 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం
గుండాల, (విజయక్రాంతి): తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(Northern Power Distribution Company of Telangana Ltd ) వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కొత్తగూడెం డివిజన్ గుండాల ఆపరేషన్ సెక్షన్ పరిధిలోని 33/11 కేవీ సబ్స్టేషన్ మామకన్నులో ప్రస్తుతం ఉన్న 3.15 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో 5 ఎంవీఏ సామర్థ్యంతో కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్ (పీటీఆర్) ను ప్రతిష్ఠించి, 3.15 ఎంవీఏ నుండి 5 ఎంవీఏకి సామర్థ్యాన్ని పెంచుతూ విజయవంతంగా చార్జ్ చేసినట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ జి మహేందర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్య పెంపుతో వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా మరింత నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వేసవికాలంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ సామర్థ్య విస్తరణ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ రంగస్వామి, వెంకటేశ్వర్లు, ఏడీఈ రాంబాబు, ఏఈ నరసింహములు, జగదీశ్ తదితర విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.




