ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు
చెన్నూర్,(విజయక్రాంతి): ఆధునిక సాగుపైన అవగాహన పెంచుకోవడం వల్లనే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యు. స్రవంతి సూచించారు. బుధవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. రైతులు ఆధునిక వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. పంట సాగులో యూరియా వినియోగంపై అవగాహన కల్పిస్తూ అవసరం ఉన్నంత వరకే యూరియా వాడాలన్నారు. ప్రస్తుత మార్కెట్ లో ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని రైతులు సన్నబియ్యం రకాల సాగుపై దృష్టి పెట్టాలన్నారు.
అధిక డిమాండ్ ఉన్న RNR 15048,KNM 1638,BPT 5204,WGL 44, HMT సోనా, జై శ్రీరామ్ లాంటి సన్న రకాలు సాగు చేయాలన్నారు. పంటల విభిన్నీకరణ (Crop Diversification) ద్వారా రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా రైతులు అడిగిన పలు ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానాలు ఇస్తూ, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రత్న సాయికృష్ణ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రాజేష్, ఫ్యాక్స్ సీఈఓ లక్ష్మణ్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు మాళవిక, వైష్ణవి, అనూష, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






