ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
ఏబీవీపీ రాష్ట్ర నాయకులు గోస్కుల అజయ్
హుజురాబాద్,(విజయక్రాంతి): పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు గోస్కుల అజయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడి చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులు బకాయిల విడుదల కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారని, సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విద్యార్థుల హక్కు తప్ప ప్రభుత్వ బిక్ష కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శివ, అభిలాష్, మణి, కుమారస్వామి తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.






