07-02-2026 07:46:53 PM
జిల్లా కలెక్టర్ కె. హరిత
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు ఆసక్తి చూపేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ, అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో సీఆర్పీలు, కృషి సఖీలకు నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
భావితరాల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రకృతి సేద్యం అవసరమని పేర్కొన్న కలెక్టర్, అధికంగా యూరియా, డీఏపీ వినియోగాన్ని తగ్గించి పశువుల పేడతో పాటు సేంద్రియ ఎరువులు ఉపయోగించాలని సూచించారు. అనంతరం వ్యవసాయ శాఖ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, సహాయ సంచాలకులు మనోహర్, మిలింద్ కుమార్, వ్యవసాయ, విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.