ఊరికి దూరంగా.. దిష్టిబొమ్మలుగా!
- నిరుపయోగంగా మారిన రైతు వేదికలు
భారంగా మారిన నిర్వహణ
వసతులు కల్పిస్తే వినియోగం
కంగ్టి, మార్చి 13:అన్నదాతలకు సాగులో మెలకువలు..అధిక దిగుబడి సాధించేందుకు తీసుకోవాల్సిన పద్దతులపై వివరించేందుకు ఏర్పాటు చేసిన రైతు వేదికలు దిష్టిబొమ్మలుగా మిగిలిపోతున్నాయి. ఊరికి దూరంగా ఉంటూ నిరుపయోగంగా మారాయి. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉం టూ అధునాతన పద్ధతుల గురించి వివరించేందుకు వీలుగా రైతులు, అధికారులు అం తా ఒక చోటచేరి సమావేశాలు నిర్వహించడానికి అనువుగా ఉంటుందని గత ప్రభు త్వంలో రూ.22 లక్షలు వెచ్చించి నిర్మించిన రైతువేదికలు పనికిరాకుండా పోతున్నాయి.
కంగ్టి మండల కేంద్రంతో పాటు కొన్ని గ్రా మాలకు కలిపి క్లస్టర్లుగా ఏర్పాటు చేసిన గాజులపాడ్, రాంతిర్థ్, నాగూర్ (బి ), బోర్గి, తడ్కల్, జంగిలో రైతు వేదికలు నిర్మించారు. రైతు వేదికలు దూరంగా ఉండడంతో అక్కడికి వెళ్ళడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు.
గతంలో రైతువేదిక నిర్వహణకు రూ.9 వేలు ప్రతినెలా కేటాయించింది. ఈ మొత్తాన్ని కరెంట్ బిల్లు, స్టేషనరి ఇతర ఖర్చులకు వాడేవారు. ఇంతవరకు బాగానే ఉన్నా రెండేళ్ల నుండి నిధులు రావడం లేదు. ప్రస్తుతం రైతువేదికల నిర్వహణ ఏఈఓలు చూస్తున్నారు. నిధులు రాకపోవడంతో ఇబ్బందిగా మారిందని అంటున్నారు. రైతు శిక్షణ, సమావేశాలు ఉన్నప్పుడు తాగునీరు, స్టేషనరి ఖర్చులు ఇబ్బందిగా మారిందని అంటున్నారు.
చాలాచోట్లా రైతు వేదికలు గ్రామానికి దూరంగా ఉండడంతో చుట్టూ ప్రహరీ గోడ భద్రత లేకపోవడంతో వేదికలోని సామాగ్రిని ధ్వంసం చేయడం, దొంగలించడం, మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. కొన్నిచోట్ల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగాయి. నీటి వసతి లేకపోవడంతో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా మారాయి. ఎరువులు, విత్తనాలను రైతువేదికల్లో పంపిణీ చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. నిపుణులు, అధికారులు వీడియో కన్ఫరెన్స్ ద్వారా సలహాలు సూచనలు చేస్తారు.
ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించాలి. కానీ వసతులు లేక పోవడంతో రైతులు ఈ కార్యక్రమాలపై ఆసక్తి చూపడం లేదు. సౌకర్యాలు కల్పించి రైతువేదికలు అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.
నిర్వహణ భారంగా మారింది...
రైతు వేదికలు ఊరి కి దూరంగా ఉండడం వల్ల రాత్రిపూట అక్కడ ఎం జరుగుతుందో తె లియడం లేదు. రెండు సంవత్సరాలుగా రైతు వేదిక నిర్వహణ నిధులు రాకపోవడంతో ఏఈఓలు సొం త డబ్బులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్లస్టర్ వారీగా రైతువేదికల్లో రైతు నేస్తం వంటి సమావేశాలకు హాజరువుతున్నాం.
హరీష్ పవర్, ఏఓ
దూరంగా ఉండడంతో ఇబ్బంది...
రైతు వేదికలు ఊరికి దూరంగా ఉండడంతో ఇబ్బందిగా మారింది. వేదికల్లో వసతులు కల్పించి ఉపయోగంలోకి తేవాలి. సిబ్బందిని కేటాయించి సరైన వసతులు కల్పిస్తే ఉపయోగం ఉంటుంది.
బసప్ప మనూరే, రైతు, చౌకన్ పల్లి




