తాగారు.. దొరికారు..
- 'డ్రంక్ అండ్ డ్రైవ్'లో 45 మంది పట్టివేత
- రూ.4.72 లక్షల జరిమానా
సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 45 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్యంరాజు తెలిపారు. శుక్రవారం వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచినట్టు చెప్పారు. విచారణ అనంతరం 45 మందికి కలిపి రూ.4 లక్షల 72 వేలు జరిమానా న్యాయమూర్తి విధించారని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ 38 మంది పట్టుబడ్డారని పేర్కొన్నారు. వారందరికీ కలిపి రూ. లక్షా 76 వేల 5 వందలు జరిమానా విధించారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిరోజు వాహనాల తనిఖీ నిర్వహిస్తామని ఇన్స్పెక్టర్ ముత్యంరాజు స్పష్టం చేశారు.






