9 July, 2026 | 2:35 AM

లైంగికదాడి నిందితుడి ఎన్‌కౌంటర్

09-07-2026 01:03 AM
  1. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో తప్పించుకునేందుకు ప్రయత్నం
  2. ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పులు
  3. మృతదేహాన్ని తీసుకునేందుకు, చూసేందుకు నిరాకరించిన తల్లి
  4. పశ్చిమ బంగాల్ ఘటనలో మరో ముగ్గురు అరెస్ట్

కోల్‌కతా, జూలై 8: పశ్చిమ బంగాల్‌లోని బరుయీర్‌పూర్‌లో బాలిక (11)పై లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడు ప్రభాస్ మోండల్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. బుధవారం తెల్లవారుజాము సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం తీసుకువెళ్లగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడని, ఓ పోలీసు వద్ద ఉన్న తుపాకీని లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించడమే గాక, ఒక రౌండ్ కాల్పులు కూడా జరిపాడని పేర్కొన్నారు. దీంతో ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపగా అతడికి బుల్లెట్ గాయాలయ్యాయన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు.

బాలిక అదృశ్యమయ్యే ముందు ఆమెతో కలిసి సీసీటీవీ దృశ్యాల్లో కనిపించాడన్నారు. ఈ కేసులో ఇప్పటికే మరో ముగ్గురిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలిక అదృశ్యమైన మరుసటి రోజు ఓ అనుమానాస్పద వ్యక్తిని గుర్తించిన స్థానికులు, కుటుంబ సభ్యులు బాలిక మృతిచెందినట్లు, స్థానికంగా ఉన్న ఓ చెరువులో మృతదేహాన్ని పడవేసినట్లు గుర్తించారు. దీంతో ఆగ్రహావేశాలతో ఆ నిందితుడిపై స్థానికులు, కుటుంబసభ్యులు దాడిచేసి చంపేశారు.

కాగా ఈ లైంగికదాడిలో 24 గంటలు గడిచినా పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి డీజీపీతో సమావేశమై 72 గంటల్లోగా ఘటనకు సంబంధించిన సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. ఆరుగురు సభ్యులతో కూడి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు.