15 May, 2026 | 3:27 AM

గణేష్ గడ్డ దేవాలయం అభివృద్ధికి కృషి

15-05-2026 01:40 AM
  1. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
  2. రూ.కోటి 50 లక్షలతో రాజగోపురాల నిర్మాణం

పటాన్ చెరు, మే 14 : గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక దేవాలయం ఆవరణలో నిర్మించిన మూడు రాజగోపురాలను ఆగస్టు 16వ తేదీన ప్రారంభించబోతున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అదే రోజు ఆలయ శిఖర ప్రతిష్టాపన సైతం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. గురువారం గణేష్ గడ్డ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలక వర్గం, ప్రజా ప్రతినిధులు,  గ్రామ ప్రముఖులు, ఆలయ ధర్మకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గుడికి నాలుగు వైపుల నిర్మిస్తున్న రాజగోపురాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు.

ఒక కోటి 50 లక్షల రూపాయల సొంత నిధులతో వీటిని నిర్మించినట్లు తెలిపారు. ఆలయంలో నిర్మిస్తున్న సాలహారం పనులు మందకొడిగా కొనసాగడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్  హరిప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీపీలు గాయత్రి పాండు, శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కృష్ణ యాదవ్, నరసింహారెడ్డి, వెంకన్న, స్థానిక కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి లావణ్య, ఆలయ కమిటీ డైరెక్టర్లు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు,  తదితరులు పాల్గొన్నారు.