శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు లారీలు ఢీ: డ్రైవర్ సజీవదహనం
శ్రీ సత్యసాయి జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా(Sri Sathya Sai District) పెనుకొండ శివారులోని జాతీయ రహదారి 44పై సోమవారం రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో ఒక ట్రక్కు డ్రైవర్ సజీవ దహనమవ్వగా, మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక కేంద్ర అధికారి వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ నుండి బెంగళూరుకు బంగాళాదుంపల లోడుతో వెళ్తున్న ఒక ట్రక్కును, గోధుమల లోడుతో వస్తున్న మరో ట్రక్కు వెనుక నుండి ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
గోధుమల ట్రక్కు డ్రైవర్ అయిన కిరణ్ (35), మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో క్లీనర్ జనార్దన్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం పెనుకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు కిరణ్, ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం జామి గ్రామానికి చెందినవాడని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






