11-02-2026 12:00:00 AM
అశ్వాపురం, ఫిబ్రవరి 10, (విజయక్రాంతి): మొండికుంట నుంచి అశ్వాపురం వెళ్లే మార్గంలో కేవీఆర్ ఫంక్షన్ హాల్ వద్ద మంగళవారం ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 7 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి. జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ జి. గణేష్, ఈఎస్ కె. తిరుపతి ఆదేశాల మేరకు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ సీహెచ్. శ్రీహరిరావు మరియు సిబ్బంది తనిఖీలు నిర్వహించగా, అనుమానాస్పదంగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి పరిశీలించగా గంజాయి లభ్యమైంది.
ఈ గంజాయిని ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న బడేటి వెంకటేష్ (సూర్యాపేట జిల్లా) మరియు మోరుబోయిన గోపయ్య (కృష్ణా జిల్లా, ఏపీ) అనే ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి, గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్తో కలిసి (మొత్తం విలువ రూ.4.60 లక్షలు) మణుగూరు ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ ఎం.ఏ. కరీం, కానిస్టేబుల్స్ సుధీర్, వెంకట్, వీరబాబు పాల్గొనగా, గంజాయి సంబంధిత సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 2523కు తెలియజేయవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్ఐ తెలిపారు.