26 August, 2026 | 4:10 AM

పస్రా పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ వార్షిక తనిఖీ

26-08-2026 12:28 AM

ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచన

శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి

గోవిందరావుపేట, ఆగస్టు 25 (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ పస్రా పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధులు, పెండింగ్ కేసుల వివరాలను ఎస్పీ సమీక్షించారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించి, పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అలాగే స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, గంజాయి మరియు ఇతర అక్రమ కార్యకలాపాలపై నిఘా మరింత పెంచాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, మరింత సమర్థవంతంగా సేవలందించాలని జిల్లా ఎస్పీ సిబ్బందికి సూచించారు.

విధుల్లో అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసి పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచేలా వ్యవహరించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసిన వాహనాల వాటి యొక్క రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోగల రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలను గమనించాలని, వారు అసాంఘిక కార్యక్రమాలు చేపడితే వారితో కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలను జారీ చేశారు. అనంతరం స్టేషన్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కార దిశగా ఆదేశాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు డిఎస్పి నలువాల రవీందర్, పస్రా సీఐ దయాకర్, పస్రా ఎస్‌ఐ తాజుద్దీన్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.