4 May, 2026 | 1:37 AM

దౌత్యమా.. యుద్ధమా!?

04-05-2026 12:22 AM

మేం రెండింటికీ సిద్ధమే..

  1.   14 పాయింట్లతో అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు
  2. ‘బంతి అమెరికా కోర్టులో ఉందన్న టెహ్రాన్ 
  3. ప్రతిపాదనలను త్వరలో సమీక్షిస్తానన్న ట్రంప్ 
  4. టెహ్రాన్ ఇంకా భారీమూల్యం చెల్లించుకోలేదని వ్యాఖ్యలు

వాషింగ్టన్/ టెహ్రాన్, మే 3: ‘దౌత్యమా.. యుద్ధమా!? మేము రెండింటికీ సిద్ధమే.. అం టూ 14 పాయింట్లతో కూడిన కొత్త ప్రతిపాదనలను అమెరికాకు ఇరాన్ పంపింది. అయితే ఇరాన్ పంపిన ప్రతిపాదనలను త్వరలో సమీక్షిస్తానన్న ట్రంప్ అన్నారు. అయితే టెహ్రాన్ తాను చేసిన నష్టానికి ఇంకా భారీమూల్యం చెల్లించుకోలేదని,ఈ ప్రణాళికను తాను ఆమోదిస్తానని అనుకోవడం లేదని వెల్లడించారు.

టెహ్రాన్ కొత్త ప్రతిపాదనను తాను తిరస్కరించవచ్చని ట్రంప్ సూచించిన తర్వాత, ఇప్పుడు బంతి అమెరికా కోర్టులో ఉందని ఇరాన్ పేర్కొంది. టెహ్రాన్ తాజా శాంతి ప్రతిపాదనపై అమెరికా సందేహాన్ని వ్యక్తం చేసిన తర్వాత, తదుపరి చర్య వాషింగ్టన్ చేతిలోనే ఉందని ఇరాన్ పేర్కొంది. ‘దౌత్య మార్గాన్ని ఎంచుకోవాలా లేక యుద్ధ వైఖరిని కొనసాగించాలా అనేది ఇప్పుడు అమెరికా చేతిలోనే ఉందని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ గరీబాబాది టెహ్రాన్‌లోని దౌత్యవేత్తలతో అన్నారు.

ఇరాన్ రెండు మార్గాలకూ సిద్ధంగా ఉందని కూడా ఆయన తెలిపారు. టెహ్రాన్ నుంచి వచ్చిన కొత్త శాంతి ప్రతిపాదనను తాను సమీక్షిస్తానని, కానీ దాని భవిష్యత్తుపై సందేహం వ్యక్తం చేస్తూ, ఇరాన్ ఇంకా ‘తగినంత భారీమూల్యం చెల్లించలేదు‘ అని అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ శనివారం అన్నారు. ఎయి ర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కే ముందు విలేకరులతో మాట్లాడుతూ, ‘దాని గురించి నేను మీకు తర్వాత తెలియజేస్తాను’ అని, ‘వారు ఇప్పుడు నాకు కచ్చితమైన పదజాలాన్ని ఇవ్వబోతున్నారు’ అని ట్రంప్ అన్నారు.

ఆ తర్వాత కొద్దిసేపటికే, ట్రంప్ సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేశారు. ‘గత 47 ఏళ్లుగా మానవాళికి, ప్రపంచానికి వారు చేసిన దానికి ఇంకా తగినంత మూల్యం చెల్లించలేదు కాబట్టి, ఇది ఆమోదయోగ్యమని నేను ఊహించలేనని వెల్లడించారు. ఇరాన్ పాకిస్తాన్ ద్వారా అమెరికాకు 14 సూత్రాలతో కూడిన కొత్త ప్రతి పాదనను పంపిందని ఇరాన్‌కు చెందిన రెండు పాక్షిక అధికారిక వార్తా సంస్థలైన తస్నిమ్ ఫార్స్ కూడా వెల్లడించాయి.

లెబనాన్‌పై దాడులతో సహా అన్ని విధాలుగా యుద్ధాన్ని ముగించాలని, తమపై మళ్లీ దాడులు చేయకుండా భదత్రా హామీలు ఇవ్వాలని, సరిహద్దు ప్రాంతాల నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకో వాలని, వివిధ దేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని, తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, హోర్ము జ్ జలసంధిలో కొనసాగుతున్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, యుద్ధం వల్ల సంభవిం చిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ కోరింది. 

ఫ్లోరిడాలో ట్రంప్ మాట్లాడుతూ, తదుపరి సైనిక చర్యకు అవకాశం ఉందని ట్రంప్ సూచించారు. ‘వారు దురుసుగా ప్రవర్తిస్తే, ఏదైనా చెడు చేస్తే, కానీ ప్రస్తుతానికి, చూద్దాం. కానీ అది జరగడానికి కచ్చితంగా అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, హోర్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయా ణం కోసం ఇరాన్‌కు చెల్లింపులు చేసే షిప్పింగ్ కంపెనీలు ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించింది.