11 March, 2026 | 1:50 AM

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం

11-03-2026 12:11 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మార్చి10: గ్రామాల అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని సర్పంచ్ బింగి కృష్ణమూర్తి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం జాజిరెడ్డిగూడెం గ్రామంలో పారిశుద్ధ్య,అభివృద్ధి కార్యక్రమాలు జరిపారు.గ్రామంలో ఉన్న అన్ని వాటర్ ట్యాంకులలో,డ్రైనేజీ కాలువల్లో బ్లీచింగ్,సున్నం చల్లించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజాపాలన లక్ష్యానికి అనుగుణంగా ప్రతి వీధిలో పారిశుధ్యం నిరంతరం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.గ్రామస్తులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.అనంతరం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించే కార్యక్రమాన్ని చేపట్టారు.గ్రామంలో శిథిలావస్థలో ఉన్న గోపాలమిత్ర భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరగా వెంటనే స్పందించిన సర్పంచ్ భవనాన్ని వినియోగంలోకి తెస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బొల్లం సైదులు,కీర్తి వెంకటేశ్వర్లు,పులిచర్ల శ్రీరాములు,నిమ్మల అడివయ్య,సమ్మయ్య, కృష్ణయ్య,మల్లయ్య,ఎల్లమ్మ,యాదమ్మ,గోపాలమిత్ర సురేందర్,ఆరోగ్య సిబ్బంది సైదమ్మ,శకుంతల,నాగమ్మ,ఆశాలు,గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.