23-02-2026 12:17:16 AM
కోనరావుపేట, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): అకాల మరణాలు ఒక నిరుపేద కుటుంబాన్ని దిక్కుతోచని స్థితిలోకి నెట్టాయి.గుండెపోటుతో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం& సుద్దాల గ్రామానికి చెందిన ఎగదండి నర్సవ్వ (బుజ్జవ్వ55) శనిగ చేను క్షేత్రంలో శనిగ కోస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో శనివారం మృతి చెందింది.కాగా, నెల రోజుల క్రితమే ఆమె భర్త ఎగదండి బాబు (ఆటో డ్రైవర్) కూడా గుండెపోటుతో మృతి చెందాడు.
ఈ దంపతులకు మమత, స్వప్న, శ్వేత, సింధుజ అనే నలుగురు కూతుర్లు ఉన్నారు.భూమిలేని నిరుపేదలైన వీరు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. భర్త మరణం తరువాత కూతుర్ల భవితవ్యంపై ఆందోళనతో నర్సవ్వ ఇంటివద్దే ఉండేది. అయినా జీవనోపాధి కోసం వ్యవసాయ పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోయింది.నెల రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందడంతో నాలుగురు కూతుర్లు కన్నీటి పర్యంతమై విలపిస్తున్నారు. ఈ పేద కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని సర్పంచ్ కుంటెళ్లి నాగరాజు,ఉపసర్పంచ్ సాయి, వార్డు సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు గ్రమస్తులు కోరుతున్నారు.