విద్యార్థులు, యువత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
"రక్షణ నేత్రం - సురక్ష మిత్ర" గోడపత్రికను ఆవిష్కరించిన ఎస్పీ స్నేహ మెహ్రా
తాండూరు,(విజయక్రాంతి): విద్యార్థులు, యువత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహర అన్నారు. శనివారం ఆమె తాండూరు పట్టణంలో డి.ఎస్.పి నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షణ నేత్రం – సురక్ష మిత్ర అవగాహన కార్యక్రమానికి ఎస్పీ స్నేహ మెహ్రా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు భద్రత, సైబర్ నేరాల నివారణ, మహిళల రక్షణ, ట్రాఫిక్ నిబంధనలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
విద్యార్థులు సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని దీంతో సమాజంలో వారికి గౌరవ పెరుగుతుందన్నారు. రక్షణ నేత్రం, సురక్ష మిత్ర కార్యక్రమాల ద్వారా యువతలో భద్రతా చైతన్యం పెంపొందించడం లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కమీషనర్ రాజేష్ రెడ్డి,కౌన్సిలర్లు , పట్టణ సీఐ పరమేష్, ఎస్ఐలు, వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, యువకులు భారీగా హాజరయ్యారు.






