విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ నిర్వహణ
08-05-2026 03:23 PM
భిక్కనూర్, మే 08(విజయ క్రాంతి): వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపొందనకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి ఆర్. రాజ గంగారెడ్డి తెలిపారు. భిక్కనూర్ మండలంలోని జడ్పీహెచ్ఎస్ (జి)భిక్కనూర్ పాఠశాలలో ఈ నెల 11 నుంచి 25 వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్యాంప్ నిర్వహించనున్నారు.
6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఈ శిక్షణ అందించబడుతుంది. క్యాంపులో డ్రాయింగ్, కంప్యూటర్, కరాటే, యోగా, ఇండోర్ గేమ్స్ తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని మండల విద్యాధికారి సూచించారు.






