వాన కొట్టింది.. బురద అయింది
ఖమ్మంపల్లిలో నడవరాక ప్రయాణికుల నరకయాతన..
వాన దారులకు తప్పని తిప్పులు..
పట్టించుకోని అధికార యంత్రాంగం..
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, ప్రజలు
మునిపల్లి,(విజయ్ క్రాంతి): గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇందులో భాగంగానే వానొస్తే చాలు ఇటీవల మండలంలోని ఖమ్మం పల్లి గ్రామంలో నిర్మించిన కల్వర్టు వద్ద బురదగా మారుతున్నది. దీంతో వాహనదారులు పడరాని పాటలు పడుతున్నారు. అలాగే బుధవారం గ్రామానికి వచ్చిన రేషన్ బియ్యం వాహనం సైతం బురదలో ఇరుక్కున్నది. దీంతో చేసేదేం లేక బురదలో వాహనాన్ని పెట్టి రేషన్ బియ్యం సంచులను దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నపాటి వర్షం పడితే చాలు ఆ కల్వర్టు వద్ద బురద మయంగా మారి ప్రయాణికులు, ప్రజలు అటుగా వెళ్లాలంటేనే జంకుతున్నారు. కల్వర్టు వద్ద బురద మయం అవడంతో తాము పడరాని తిప్పలు పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్వర్టు వద్ద బురదమయం కాకుండా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.






