13 May, 2026 | 7:50 PM

వేగంగా ధాన్యం కొనుగోలు జరగాలి

13-05-2026 06:56 PM

* రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు ఉండకూడదు 

* జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

పాపన్నపేట: జిల్లాలో వేగంగా ధాన్యం కొనుగోలు జరగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పాపన్నపేట మండలంలోని కుర్తివాడ గ్రామంలోన ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు  కేంద్రాన్ని డీఎస్ఓ, డిఎంసిఎస్ఓతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. స్థానిక హమాలీలను 100 శాతం వినియోగించుకోవాలని, ఎక్కడా హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలన అనంతరం రైతులకు వెంటనే రశీదులు ఇవ్వాలని, రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు ఉండకూడదని ఆదేశించారు. పంట రవాణా కోసం ఖాళీగా ఉన్న అన్ని వాహనాలు, ట్రాక్టర్లు, డీసీఎంలను పూర్తిస్థాయిలో వినియోగించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద, నిర్వాహకులు పాల్గొన్నారు.