13 May, 2026 | 7:49 PM

ప్రశాంతంగా పాలిసెట్ ప్రవేశ పరీక్ష

13-05-2026 06:59 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పాలిసెట్–2026 ప్రవేశ పరీక్ష మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, కొమురం భీమ్ జిల్లాలోని ఆసిఫాబాద్ కోఆర్డినేటింగ్ కేంద్రాల పరిధిలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. బెల్లంపల్లి కోఆర్డినేటింగ్ కేంద్రం పరిధిలో 1,171 మందికి గాను 1,119 మంది (95.56%) హాజరు కాగా, మంచిర్యాల కేంద్రంలో 2,365 మందికి 2,206 మంది (93.28%), ఆసిఫాబాద్ కేంద్రంలో 1,064 మందికి 1,002 మంది (94.12%) విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్షల నిర్వహణను ప్రత్యేక పరిశీలకుడు ఎ. కాంతయ్య పర్యవేక్షించగా, అసిస్టెంట్ కోఆర్డినేటర్ బి. వెంకటేశ్వర్లు, రూట్ ఆఫీసర్ డా. ఎస్. నాగరాజు, వివిధ కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు సమన్వయంతో విధులను నిర్వహించారని కో ఆర్డీ నేటర్ ఎం దేవేందర్ పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లతో పాటు తాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేశారు.