25 August, 2026 | 9:58 PM

భూముల రీ సర్వే కచ్చితత్వంతో చేయాలి

25-08-2026 07:24 PM

వివరాలు పక్కాగా నమోదు చేయాలి

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లిలో భూ భారతి కింద భూముల రీ సర్వే పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

గంభీరావుపేట,(విజయక్రాంతి): భూ భారతి కింద భూముల రీ సర్వే కచ్చితత్వంతో చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లిలో భూ భారతి కింద రోవర్ యంత్రంతో భూముల రీ సర్వే పనులు కొనసాగుతుండగా, మంగళవారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే యంత్రంతో వివరాలు ఎలా తీసుకుంటారో పరిశీలించి అడిగి తెలుసుకున్నారు.

గ్రామ సరిహద్దు సర్వే పూర్తి అయిందని, ప్రస్తుతం ప్రభుత్వ భూముల సర్వే కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకువెళ్ళారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో భూ భారతి కింద భూముల రీ సర్వే పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామంలో సర్వే పై రైతులకు ముందుగా సమాచారం అందించాలని సూచించారు. భూముల వివరాలను పూర్తి కచ్చితత్వంతో నమోదు చేయాలని స్పష్టం చేశారు. 

బోర్ వెల్ రీచార్జ్ పనుల పరిశీలన

గంభీరావుపేట మండలం గజ సింగవరంలో గ్రామ బోర్ వెల్ వద్ద రీచార్జ్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. గ్రామంలో ఉన్న రైతులు, గృహ నిర్మాణదారులు బోర్ వెల్ రీచార్జ్ పనులు చేపట్టేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, ఏడీ సర్వే శ్రీనివాస్, ఎంపీడీఓ రాజేందర్ అధికారులు సిబ్బంది ఉన్నారు.