26 February, 2026 | 9:48 AM

ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

26-02-2026 12:32 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షల సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రశ్నాపత్రాల భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ, విద్యార్ధుల హాజరు శాతం, హాల్ టికెట్ల తనిఖీ తదితర అంశాలను ఆయన పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, మాల్ప్రాక్టీస్కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్ధులు మొబైల్ ఫోన్లు పరీక్ష కేంద్రాలకు తీసుకురాకుండా చూడాలని, సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఇంటర్మీడియట్ అధికారి , తహసిల్దార్ హిమబిందు, ప్రిన్సిపల్, తదితరులు పాల్గొన్నారు.