విద్యుత్ వినియోగదారులే మా ప్రథమ ప్రాధాన్యత
CGRF-II చైర్మన్ ఎరుకల నారాయణ...
బాన్సువాడ,(విజయక్రాంతి):ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్ సబ్ డివిజన్ బాన్సువాడ ఆధ్వర్యంలో గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (CGRF-II) సమావేశం జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ టౌన్, బాన్సువాడ రూరల్, బిర్కూర్, నస్రుల్లాబాద్ సెక్షన్ల పరిధిలోని వినియోగదారుల నుండి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు స్వీకరించి, అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు చేపట్టారు.CGRF-II చైర్పర్సన్ ఎరుకల నారాయణ మాట్లాడుతూ "వినియోగదారులే మా ప్రథమ ప్రాధాన్యత. విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోపం ఉన్నా నిర్భయంగా మా ఫోరంకు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదుకు ఎలాంటి రుసుము లేదు, అడ్వకేట్ అవసరం లేదు.
అవసరమైతే మా సభ్యులే మీ ఇంటికి వచ్చి సమస్యను పరిష్కరిస్తారు" అని హామీ ఇచ్చారు.మెంబర్ టెక్నికల్ సలంద్ర రామకృష్ణ మాట్లాడుతూ "కరెంట్ కోతలు, వోల్టేజ్ సమస్యలు, ట్రాన్స్ఫార్మర్ లోపాలు, మీటర్ స్టిక్ కావడం వంటి సాంకేతిక సమస్యలను 48 గంటల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. కొత్త కనెక్షన్ల జాప్యం లేకుండా చూస్తాం" అని తెలిపారు.మెంబర్ ఫైనాన్స్ శేర్ల సత్యనారాయణ మాట్లాడుతూ "ఎక్కువ బిల్లులు, బిల్లులో పేరు తప్పులు, కేటగిరి మార్పు వంటి ఆర్థిక సమస్యలను వెంటనే సరిచేస్తాం.
వినియోగదారులు ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు" అని స్పష్టం చేశారు."గ్రామీణ ప్రాంత వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ ఫిర్యాదును Whatsapp, పోస్టు లేదా 1912 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంపితే చాలు. మా బృందం మీ వద్దకే వస్తుంది" అని చెప్పారు.ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరిగింది. ఫిర్యాదు చేయడానికి: టోల్ ఫ్రీ నం. 1912, ఫోన్: 83380-22841, మెయిల్: cgrf2nizamabad@gmail.com కార్యాలయం: పవర్ హౌస్ కాంపౌండ్, వర్ని రోడ్, నిజామాబాద్ వెబ్సైట్: http://210.212.223.83:9070/CGRF/CgrfWebsit.jspనిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, కె.బి. ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల హెచ్.టి. మరియు ఎల్.టి. వినియోగదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని CGRF-II ఫోరం కోరింది.






