విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది
- డిసిసి అధ్యక్షురాలు తూంకుంట అంక్షారెడ్డి
గజ్వేల్,(విజయక్రాంతి): విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షురాలు తూంకుంట అంక్షారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు చేపట్టిన "ఛాత్రోస్ కీ గూంజ్" ఉద్యమంలో భాగంగా గజ్వేల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతతో సమావేశం నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూంకుంట అంక్షారెడ్డి మాట్లాడుతూ, దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని ఆరోపించారు.
ప్రశ్నపత్రాల లీకేజీలు, ఉద్యోగ నియామకాల్లో జాప్యం కారణంగా విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, నీట్ సహా పలు జాతీయ స్థాయి పరీక్షల్లో జరిగిన అవకతవకల వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదని అన్నారు. విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, "ఛాత్రోస్ కీ గూంజ్" ఉద్యమానికి మద్దతుగా విద్యార్థులు, యువతతో సంతకాల సేకరణ నిర్వహించినట్లు తెలిపారు. దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉన్నందున వారి హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.






