స్థానిక ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం
- తొమ్మిదో షెడ్యూల్లో చేరిస్తే తప్ప రిజర్వేషన్లు సాధ్యం కావు
- మెట్రో వాటా కొనుగోళ్లలో రూ.వెయ్యి కోట్లు చేతులు మారాయి
- మాజీమంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి జగదీష్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. తొమ్మిదో షెడ్యూల్ లో చేరిస్తే తప్ప బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం కావన్నారు. బిల్లులు ఆమోదం పొందకపోయినా జీఓ తీసుకొచ్చి బీసీల కళ్లకు గంతలు కడతారా? అని ప్రశించారు.
మెట్రో రైల్ విషయంలో ప్రభుత్వ వైఖరి అనుమానం కలుగుతోందని తెలిపారు. మెట్రో వాటా కొనుగోళ్లలో వెయ్యి కోట్లు చేతులు మారినట్లు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలపై 15 వేల కోట్ల భారం, సీఎం వెయ్యి కోట్లు వెనకేసుకున్నారని తెలిపారు. ఎల్ అండ్ టీకి చెందిన 35 వేల కోట్ల విలువైన భూములను తనకు ఇష్టమైన కంపెనీలకు అప్పగిస్తారని జగదీష్రెడ్డి ఆరోపించారు.






