ఓట్ల తొలిగింపుతో బీజేపీ రాజకీయం
- అర్హులైనవారి ఓటు తొలిగిస్తే సహించేది లేదు
- బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలి
- టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్
- ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఎల్ఏలకు శిక్షణ
- హాజరైన రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి,
- వెన్నెల గద్దర్, మల్ రెడ్డి రాంరెడ్డి
ఎల్బీనగర్, జూన్ 12 : ఓటరు సవరణ ప్రక్రియ ద్వారా బీజేపీ ఓట్ల తొలిగింపుతో రాజకీయం చేస్తుందని టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. బీజేపీ తమ వ్యతిరేక వర్గాల ఓట్లను తొలిగించి ఎన్నికల్లో లబ్ధి పొందుతుందని, మొన్న జరిగిన బెంగాల్ ఎన్నికల్లో ఇదే జరిగిందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ లకు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఎల్బీనగర్ రాక్ హిల్స్ కాలనీలోని ఎస్వీఎల్ ఎరీనాలో నిర్వహించారు.
మధుయాష్కీగౌడ్తో పాటు రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, బీఎల్ఏ ల నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నెల గద్దర్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ.. తెలంగాణలో జరగనున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్క బీఎల్ఏలు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఓటర్ల తొలగింపులు-చేర్పులపై సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. సర్ ప్రక్రియలో బీఎల్ఏలు చాలా కీలకమని పేర్కొన్నారు.
చల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ... మోడీ ప్రభుత్వం సర్ తో ఓట్ చోరీకి పాల్పడుతుందని, పేద వర్గాల ఓట్లు గల్లంతు కాకుండా బీఎల్ఏ లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వెన్నెల గద్దర్ మాట్లాడుతూ.. మన ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ కోసం, మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్ లో పార్టీ బీఎల్ఏ లు క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. మల్ రెడ్డి రామ్ రెడ్డి మాట్లాడుతూ... ఎస్ఐఆర్ ప్రక్రియ అంత ఆషామాషిగా తీసుకోవద్దన్నారు.
ఇటీవల బీఎల్వోలు నిర్వహించిన సర్వేలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో 74 శాతం మందికి ఓటర్ మ్యాపింగ్ లో తేడాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఓటర్ మ్యాపింగ్ చూస్తే చాలా ఓట్లు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, బీఏల్ఏలు సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టీపీసీసీ నియమించిన ట్రైనర్ చైతన్య కృష్ణారెడ్డి ఎస్ఐఆర్ ప్రక్రియను వివరించి, బీఎల్ఏల బాధ్యతలను వివరించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.






