బీజేపీ నేత కుమారుడి ఆత్మహత్య
- స్థల వివాదం కారణంగా బలవన్మరణం
- ముషీరాబాద్లో తీవ్ర ఉద్రిక్తత
ముషీరాబాద్,ఆగస్టు 25 (విజయక్రాంతి): బీజేపీ నాయకుడు కుమారుడు యాదగిరి ముదిరాజ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ముషీరాబాద్లో కలకలం రేగింది. తన చావుకి మసీదు కమిటీ సభ్యులే కారణమంటూ ఆయన ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో రికార్డు చేసిన అనంతరం ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సెల్పీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వేధింపులకు గురి చేసిన మసీదు కమిటీ సభ్యుల్లో ముగ్గురుని పోలీసులు తక్షణం అరెస్టు చేశారు.
ముషీరాబాద్కు చెందిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సదానంద్ ముదిరాజ్ పెద్ద కుమారుడు దొడ్ల యాదగిరి (54) కుటుంబం ముషీరాబాద్ చౌరస్తా సమీపంలో గల మసీదు పక్కనే ఉన్న స్థలంలో గత 54 సంవత్సరాలుగా బొగ్గుల వ్యాపారం నిర్వహిస్తున్నారు. మసీదు పక్కనే ఉన్న స్థలంలో వ్యాపారం చేస్తున్న యాదగిరికి, మాసీదు కమిటీ సభ్యుల మధ్య స్థల వివాదం కొనసాగుతున్నది. ఇటీవల యాదగిరి వెళ్లి కమిటీ సభ్యులను స్థలం విషయంపై మరోసారి చర్చలు జరిపారు.
కమిటీ సభ్యుల వేధింపులు అధికం కావడంతో తీవ్ర మన స్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాదగిరి తమ్ముడు మురళి గాంధీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమో దు చేసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మసీద్ కమీటీ సభ్యు లు షాహెద్, చోటు, ఎగ్బాల్ ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. కాగా ఉద్రిక్తతల మధ్య యాదగిరి అంతిమయాత్ర కొనసాగింది.
యాదగిరి కుటుంబ సభ్యులు, పోలీసుల మధ్య వాగ్వాదం చో టు చేసుకుంది. ఎంపీలు డాక్టర్ కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ నేత జైసింహ, బీజేపీ నేతలు ఎడ్ల హరిబాబు యాదవ్, నాగేష్ ముదిరాజ్, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, మాజీ కార్పొరేటర్లు సుప్రియా నవీన్ గౌడ్, పావని వినయ్ కుమార్, బీజేపీ మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ తదితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.






