18-02-2026 12:00:00 AM
బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్
హైదరాబాద్, సిటీబ్యూరో ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించాయని, బీసీల రాజకీయ చైతన్యానికి ఈ ఫలితాలే సజీవ సాక్ష్యమని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ అభివర్ణించారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ స్థానాల్లో బీసీలు ఏకంగా 61 శాతం మేర విజయం సాధించి విజయ దుందుభి మోగించడం మారుతున్న రాజకీయ వాతావరణానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
మంగళ వారం హైదరా బాద్లోని బాగ్ లింగంపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ ఫలితాలపై తన విశ్లేషణను పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియ, దాని ద్వారా వెలువడిన అధికారిక గణాంకాలు బీసీలను రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రభావితం చేశాయని దాసు సురేశ్ పేర్కొన్నారు. తమ జనాభా ఎంత తమకు దక్కుతున్న వాటా ఎంత అనే స్పష్టత రావడం వల్ల బీసీల్లో పెల్లుబికిన చైతన్యం ఓట్ల రూపంలో వెల్లడయ్యిందన్నారు. ఈ సమావేశంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.