రైతు దంపతుల మరణంపై వ్యవసాయ శాఖ నివేదిక
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మే 25 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లి గ్రామంలో గత శనివారం వ్యవసాయ భూమిలో పంటల అవశేషాల మంటలు విస్తరించకుండా అడ్డుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై మరణించిన దంపతుల ఘటనపై వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు.
జిల్లా వ్యవసాయ అధికారి బాపు రావు, ఏవో వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో సంఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. రైతు చాగర్ల చంద్రమౌళి, అతని భార్య భాగ్యలక్ష్మి మరణించిన నేపథ్యంలో భాగ్యలక్ష్మి రైతు బీమాకు అర్హురాలని, బీమా పరిహారం ఇవ్వడానికి అవసరమైన నివేదిక రూపొందించారు. త్వరలో బాధిత రైతు కుటుంబానికి పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా డిఏఓ మాట్లాడుతూ రైతులు పంట అవశేషాలను కాల్చకూడదని, పొలంలో కలియ దున్ని పర్యావరణ పరిరక్షణకు, భూసార పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.






